గులాబీ పార్టీకి డొనేషన్ల వెల్లువ.. 2022లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

by Disha Web Desk 19 |
గులాబీ పార్టీకి డొనేషన్ల వెల్లువ.. 2022లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల సీజన్ లేనప్పటికీ గులాబీ పార్టీకి డొనేషన్లు భారీగానే వచ్చాయి. దేశవ్యాప్తంగా మరే ప్రాంతీయ పార్టీకి లేనంతగా గరిష్ట స్థాయిలో అటు ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా, ఇటు బాండ్ల ద్వారా కేవలం సంవత్సర కాలంలోనే రూ. 193 కోట్ల మేర సమకూరాయి. వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ఈ పార్టీకి సమకూరింది కేవలం రూ. 90 లక్షలే. కానీ గోప్యంగా ఉండిపోయేందుకు ట్రస్టుల ద్వారా, బాండ్ల ద్వారా విరాళాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే పార్టీకి సుమారు వెయ్యి కోట్ల మేర స్థిర, చరాస్తులు ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీ సందర్భంగా శ్రేణులకు తెలిపారు. దీనికి అదనంగా రూ. 193 కోట్లు ఈ ఒక్క సంవత్సరమే చేరినట్లయింది. ఇవన్నీ అక్టోబరు, నవంబరు మాసాల్లో వచ్చిన విరాళాలే.

ఇతర పార్టీల కంటే అధికం..

పొరుగున అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ, తమిళనాడులోని డీఎంకే, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, గతేడాది వరకూ ఉత్తరప్రదేశ్‌లో పవర్‌లో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే బీఆర్ఎస్‌కు వచ్చినవే ఎక్కువ. అన్ని ట్రస్టుల ద్వారా కలిపి 2022లో వేర్వేరు రాజకీయ పార్టీలకు ఫండింగ్ కోసం రూ. 487 కోట్లు వస్తే అందులో దాదాపు 10% మేర ఒక్క బీఆర్ఎస్‌కే దక్కాయి. అత్యధికంగా బీజేపీకి 72% (రూ. 357 కోట్లు) చేరాయి. సమాజ్‌వాదీ పార్టీకి రూ. 27 కోట్లు, వైఎస్సార్సీపీకి రూ. 20 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 16 కోట్లు, అకాలీదళ్‌‌కు రూ. 7 కోట్ల చొప్పున వచ్చాయి. జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌కు వచ్చింది కేవలం రూ. 16.50 కోట్లే. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినదాంట్లో సగం కూడా దేశమంతా కలుపుకుని కాంగ్రెస్‌కు దక్కలేదు.

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2022లో సుమారు రూ. 464.81 కోట్ల మేర విరాళాలు అందాయి. మిగిలిన 22 ట్రస్టులకు కలిపి సుమారు రూ. 23 కోట్లు అందాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎలాంటి విరాళాలు ట్రస్టుకు అందకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లోని పార్టీలకు కలిపి రూ. 60 కోట్ల మేర వచ్చాయి. ట్రస్టుకు విరాళం ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలు ఫలానా పార్టీ కోసమంటూ చెప్పడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈ రెండు పార్టీలకు అందాయి. అదే సమయంలో దేశం మొత్తం మీద కేవలం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) ద్వారా మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరగ్గా అందులో బీఆర్ఎస్ పార్టీకి రూ. 153 కోట్లు వచ్చాయి. ఏక కాలంలో బాండ్ల ద్వారా, ట్రస్టుల ద్వారా విరాళాలు భారీ స్థాయిలో బీఆర్ఎస్‌కు రావడం గమనార్హం.

2022లో బీఆర్ఎస్ పార్టీకి వేర్వేరు రూపాల్లో వచ్చిన డొనేషన్లు (రూ.లలో) :

వ్యక్తుల ద్వారా : 90 లక్షలు

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా : 40 కోట్లు

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా : 153 కోట్లు

మొత్తం : 193.90 కోట్లు

Also Read...

ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా KCR భారీ స్కెచ్.. BRS అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్..!

Next Story

Most Viewed